
దుర్గాబాయి 1909లో రాజమండ్రి లో కృష్ణవేణమ్మ, రామారావు దంపతులకు జన్మించారు. ఈమె బాల్యంనుండి ప్రతిభాపాఠవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన కావించేవారు. చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పని చేస్తూ నెహ్రూ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన హిందీ ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది. స్వాతంత్య్ర సమరకాలంలో ఉద్యమాల్లో పాల్గొని విరామ సమయాల్లో విద్యాభ్యాసం చేసి ఎంఎ, బిఎల్, బిఎ ఆనర్స్ చేసి న్యాయకోవిదురాలిగా, ప్రఖ్యాత క్రిమినల్ లాయర్గా పేరుగాంచారు.
దుర్గాబాయి అనేక మహిళా సంస్థలు, సాంఘీక సంక్షేమ సంస్థలను ప్రారంభించి స్త్రీల అభ్యున్నతికి కృషిచేశారు. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది.1937లో లిటిల్ లేడీస్ ఆఫ్ బ్రుందావన్ అనే బాల సంఘాన్ని ప్రారంభించింది.ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది. చెన్నైలో 70మంది కార్యకర్తలతో ఉదయవనంఅను పేరుతో సత్యాగ్రహ శిభిరం ఏర్పరిచారు.1953లో ఆర్థికమంత్రి చింతామణి దేశ్ ముఖ్ తో వివాహం జరిగింది.1971లో సాక్షారతా భవన్ ని ప్రారంభించినది.
భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పని చేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పని చేసారు. ఆ సందర్భములో సి.డి.దేశ్ముఖ్ తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది. వీరి వివాహము 1953 జనవరి 22న చోటు చేసుకుంది. ఈవిడ 1953 ఆగష్టులో భారత ప్రభుత్వంచే నెలెకొల్పబడిన కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు (Central Social Welfare Board - సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్) వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పని చేసారు. ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్కు అధ్యక్షురాలిగా పని చేసారు. 1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు.వీరి స్వీయచరిత్ర భాషించిన శిలలు అన్న పేరుతో వెలువడింది.ఈమె చిత్రంతో భారతప్రభుత్వం ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.1981లో మే9న మరణించెను.
• 1975 - పద్మ విభూషణ్. అదే సంవత్సరం ఆవిడ భర్త సి.డి.దేశ్ముఖ్ కూడా పద్మ విభూషణ్ పొందారు.
• ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి గౌరవ డాక్టరేట్
• 1971 - నెహ్రూ లిటరసీ అవార్డు{వయోజన విద్యాసేవలకు గుర్తింపుగా వొచ్చింది.}
• యునెస్కో నుండి పాల్ జి. హాఫ్మన్ అవార్డు
• కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు వారు 1998లో ఈవిడ పేరున డా.దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డును నెలకొల్పారు. ఈ వార్షిక అవార్డు మహిళాభ్యున్నతికి పాటుపడే స్వచ్చంద సంస్థకై ఉద్దేశించబడినది.
• ఢిల్లీలో ఉన్న బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్ వారు 2006లో ఈవిడ పేరున దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ను నెలకొల్పారు.
• ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1987లో నెలకొల్పబడిన సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ 2006లో డా.దుర్గాబాయి దేశ్ముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్గా నామాంతరం చెందింది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి