26, మార్చి 2014, బుధవారం

బుడ్డా వెంగళరెడ్డి - 1866 లో సంభవించిన డొక్కల కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత.

బుడ్డా వెంగళరెడ్డి (1840 - 1900) 1866 కాలంలో సంభవించిన డొక్కల కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత.

1800-1900 ప్రాంతాల్లో రేనాటి సీమను ఇద్దరు మహనీయులు పునీతం చేశారు। ఇద్దరు కర్నూలు జిల్లా నొస్సం మండలం ఉయ్యాలవాడ వాస్తవ్యులే కావడం కూడ విశేషమే.ఒకరు కంపెనీ పాలన మీద కత్తి దూసి స్వేచ్చకోసం పోరాడి ఉరికొయ్యకు బలీయిపోయి తరువాతి స్వాత్రంత్ర ఉద్యమానికి ప్రేరణ ఇచ్చిన వాడు। చైతన్యం నింపినవాడు. స్వాతంత్ర కాంక్షను రగిలించి మండే సూర్యుడయ్యాడు. అందుకే రేనాటి సూర్యుడు- విప్లవసింహం ఉయ్యాలవాడ నారసింహరెడ్డి. మరొకరు కరవు బారిన పడిన పేదలకు తన ఆపన్న హస్తం చాచి కడుపు నిండా అన్నం పెట్టి కలియుగ దానకర్ణుడని పేరుపొంది రేనాటికి చల్లని వెన్నెల పంచిన చంద్రుడు -- బుడ్డా వెంగళరెడ్డి.

వీరు కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో నల్లపురెడ్డి మరియు వెంకటమ్మ దంపతులను జన్మించా
రు. ఇతడు పెద్దగా చదవకపోయినా తల్లినుండి దానగుణాన్ని దాని గొప్పదనాన్ని తెలుసుకున్నారు.
రెడ్డిగారు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ ఒక్క భార్యకు కూడా సంతానం కలుగలేదు. అందువలన తన తమ్ముని కుమారుని దత్తత తీసుకున్నా
రు.
1866 కాలంలో వీరి కీర్తి ప్రతిష్టలు విన్న పేద ప్రజలు బళ్ళారి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి తండోపతండాలుగా ఉయ్యాలవాడ చేరి రెడ్డిగారిని ఆశ్రయించారు. వారి దీనస్థితిని అర్ధంచేసుకున్న రెడ్డిగారి ఇంట్లో ఉన్న ఆరు పుట్ల ధాన్యాన్ని గంజి కాయించి వేలాది కుటుంబాల ఆకలిని తీర్చారు. పూటకు ఎనిమిది వేలకు తక్కువ కాకుండా ఈ కరవు కాలంలో బుడ్డా వెంగళరెడ్డి కరవు పీడితులైన ప్రజలకు మూడు నెలల పాటూ అన్న వస్త్రాలు ఇచ్చి కన్నతండ్రిలాగా కాపాడాడు. రాయలసీమలో పుట్టిన అపర దానకర్ణుడు వెంగళరెడ్డి. రాయలసీమ ప్రజలు ఇప్పటికి ఇతని దాతృత్వాన్ని గురించి చెప్పుకుంటారు. వంటమనిషి గంగన్న ఆకాలంలో చేసిన సేవలకు మెచ్చిన రెడ్డిగారు అతనికొక బంగారు కడియం తొడిగి సత్కరించారు. అనంతర కాలంలో స్వగ్రామంలో పాఠశాలను నెలకొల్పి శివరామశాస్త్రి అనే పండితుని కుటుంబాన్ని పోషిస్తూ విద్యాదానం చేశారు.

కరవు బారిన పడిన పేదలకు తన ఆపన్న హస్తం చాచి కడుపు నిండా అన్నం పెట్టి కలియుగ దానకర్ణుడని పేరుపొందిన బుడ్డా వెంగళరెడ్డి. తనకు ఉన్నాదంతా దానం చేసిన ఈ మహానుభావుని దాతృత్వానికి పరాయి పాలకులకు సైతం ఆశ్చర్యం వేసింది. అందుకే విక్టోరియా మహారాణి ఈయన సేవలను గుర్తించి బంగారు పతకాన్ని బహుమానంగా ఇచ్చింది. ప్రభుత్వం ఈయన్ను ప్రొవిన్సియల్ జ్యూరీ యొక్క సభ్యునిగానూ, మద్రాసు గవర్నరు కౌన్సిల్ యొక్క గౌరవ సభ్యునిగానూ చేసి గౌరవించింది. ఈ సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది. ఆ బంగారు పతకముపై క్రింది విధంగా చెక్కబడినది. "1866వ సంవత్సరంలో సంభవించిన క్షామకాలమందు, నిరాధారముగా నుండిన, తన స్వదేశస్థుల పట్ల జరిపించిన ఉత్కృష్ట ఔదార్యమునకు గాను, హర్ మైజెస్టి రాణిగారి వల్ల చేయబడిన శ్రేష్టమైన గణ్యతకు ఆనవాలుగా బుడ్డా వెంగళరెడ్డిగారికి బహుమానమివ్వబడినది."
రెడ్డిగారు ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు స్వగ్రామంలోని అగస్తేశ్వర దేవాలయంలో ఉత్సవాలు జరిపి, పండితులను సత్కరించి, అన్నదానాలు చేసేవారు.
మహాదాతగా పేరుగాంచిన వెంగళరెడ్డి గారు డిసెంబరు 31 1900 తేదీన శివసాయుజ్యాన్ని పొందారు. ఆతని కీర్తి ఆచంద్రతారార్కం నిలుస్తుంది. అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు వివిధ జానపద కళలలో అతన్ని కీర్తిస్తుంటారు.

2 కామెంట్‌లు:

  1. శ్రీవెంగళరెడ్డిగారి గురించిన ఐతిహ్యం ఒకటి విన్నాను.

    ఒక పేదబ్రాహ్మణుడు వెంగళరెడ్డిగారిని తన యింటిలో త్వరలో జరగనున్న శుభకార్యం నిమిత్తంగా ఏదైనా ద్రవ్యసహాయం చేయమని అర్థించాడు. రెడ్డిగారు అంగీలో చేయిపెట్టి ఒక నోటు తీసి ఇచ్చారు. అది చిన్నమొత్తం. ఆ బ్రాహ్మణుడు చిన్నబుచ్చుకున్నాడు. అది చూసి రెడ్డిగారు అర్థితో, "అయ్యా, మీ ప్రాప్తం అంతే ఉన్నది" అన్నారు. కాని బ్రాహ్మణుడికి నమ్మకం కలుగలేదు. అప్పుడు రెడ్డిగారు తన కోడలిని పిలచి ఒక చేటలో బియ్యమూ దానిలో గూడంగా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన నోటుతో పాటు మరొక వందనోటును కూడా ఉంచి తీసుకొని రమ్మన్నారు. అలా ఆవిడ తెచ్చిన పిదప, బ్రాహ్మణోత్తముడు స్వయంగా చేయిపెట్టి బియ్యపుచేటలోనుండి తీసుకొంటె మొదట రెడ్డిగారు ఇచ్చిన నోటే తిరిగి లభించింది. తదుపరి, రెడ్డిగారు రెండవనోటుని బియ్యపుచేటనుండి ఆ బ్రాహ్మణుడికి వెలికి తీసి చూపి, తన వాక్యం సత్యం అని ఋజువు చూపారట.

    రిప్లయితొలగించండి