22, జనవరి 2015, గురువారం

గోరింక పక్షులు





26, డిసెంబర్ 2014, శుక్రవారం

తిరుపతి వేంకట కవులు ---- పద్యానికి పట్టాభిషేకం చేసిన మహనీయులు..., చిరస్మరణీయులు


దివాకర్ల తిరుపతి శాస్త్రి (1872-1919) మరియు చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి (1870-1950) - ఇద్దరు కవులు తిరుపతి వేంకట కవులు అని జంట కవులుగా తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులయ్యారు.
మధురము, మనోజ్ఞమూ, రాగశోభితమూ, రసరంజితమైన లలిత సుందర పదబంధాలను పద్యంగా విరచిస్తే- అది అనవద్యంగా, హృద్యంగా ధ్వనిస్తుంది. విశ్వవినువీధుల్లో మధుర సుమధురంగా రవళిస్తున్న పద్యక్రియ అచ్చమైన తెలుగువాడి సొత్తు. గుండెలోతుల్లోనుండి ఉబికిన పద్యం కంఠనాళాలమధ్య సుడులు తిరిగి రాగంగా ధ్వనించి ప్రతిమనిషి కర్ణపుటాలలో అమృతపు సోనలను వర్షిస్తుంది. పద్యంతో కొందరు కావ్యాలు అల్లితే, కొందరు శతకాలతో నీతి సుధలను కురిపించారు. మరికొందరు పద్యానికి గద్యాన్ని జతచేసి అభినయ రూపమిచ్చారు. ‘అదిగో ద్వారక’, ‘బావా ఎప్పుడు వచ్చితీవు’, ‘చెల్లియో చెల్లక’, ‘జండాపై కపిరాజువంటి వందలాది పద్యాలతో భారత ఇతివృత్తాన్ని నాటకాలుగా రచించి అభినయాన్ని జోడు కట్టిన ఖ్యాతిగన్న జంటకవులు తిరుపతి వేంకట కవులు. నిరక్షర కుక్షులైన గొడ్లకాడి బుడ్డోళ్లనుండి సాహిత్యాన్ని పుక్కిటబట్టిన పండిత ప్రకాండుల వరకు తన్మయత్వంతో పాడుకోగల కవిత్వాన్ని రచించి పద్యానికి పట్టాభిషేకం చేసిన మహనీయులు..., చిరస్మరణీయులు తిరుపతి వేంకట కవులు. ‘దోసమటం చెరింగియును దుందుడుకొప్పగ బెంచినారమీ మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు తెల్పగాఅంటూ ఆత్మవిశ్వాసంతో సాధికారంగా ప్రకటించుకొన్న ఆధునిక సాహిత్యంలో తొలి జంటకవులైన దివాకర్ల తిరుపతి శాస్ర్తీ, చెళ్లపిళ్ల వెంకటశాస్ర్తీ స్థానం నాటక సాహిత్య చరిత్రలో సువర్ణాక్షర లిఖితం.
అపూర్వమైన అవధాన విద్యతో ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగించి ఆచంద్ర తారార్కం తెలుగువారి గుండెల్లో చిరకీర్తి సముపేతులైన తిరుపతి వేంకట కవులు మహాభారత కథను ఆధారంగా చేసుకొని పాండవ జననము, పాండవ ప్రవాసము, పాండవోద్యోగము, పాండవవిజయము, పాండవాశ్వమేధము అనే నాటకాలను రచించి చిరస్మరణీయులయ్యారు. మహాభారతాన్ని చదవని వారికి సైతం కథను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు నాటకాల ద్వారా వివరించి చరితార్థులయ్యారు. తెలుగుదనం, తెలుగు నుడికారం, తెలుగు పలుకుబడులను నాటకాలలో గుప్పించి, భాషా మధురిమలను జాతికి పంచిపెట్టారు. నాటకాలతోపాటు శతాధిక గ్రంథాలను, ఆశువుగా వేలాది పద్యాలను చెప్పడమే కాకుండా రాష్ట్రంతోపాటు రాష్ట్రేతర పాంతాలలో కూడా వీరవిహారం చేసి గజారోహణ, గండపెండేర సత్కారాలను పొందారు.
దివాకర్ల తిరుపతి శాస్త్రి  1872 మార్చి 26 పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వద్ద యండగండి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వెంకటావధాని కూడా గొప్ప వేదపండితుడు, సూర్యోపాసకుడు. తిరుపతి శాస్త్రి విద్యాభ్యాసం బూర్ల సుబ్బారాయుడు, గరిమెళ్ళ లింగయ్య, పమ్మి పేరిశాస్త్రి, చర్ల బ్రహ్మయ్య శాస్త్రిల వద్ద సాగింది. చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చదువుకునే సమయంలో తిరుపతి శాస్త్రికి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తోడయ్యారు. 1898లో తిరుపతి శాస్త్రి వివాహం జరిగింది.
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి 1870 ఆగస్టు 8 తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించారు. ఆయన ముత్తాత తమ్ముడు వేంకటేశ్వర విలాసము,యామినీ పూర్ణతిలక విలాసము అనే మహద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంధాలు వేంకట శాస్త్రికి అందుబాటులో ఉన్నాయి. తరువాత వారు యానాంకు మకాం మార్చారు. యానాంలో వేంకట శాస్త్రి తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషలు అధ్యయనం చేశాడు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు.
18 ఏండ్ల వయసులో యానాం వేంకటేశ్వర స్వామి గురించి వ్రాసిన శతకంలో వ్యాకరణ దోషాల గురించి స్థానిక పండితులు విమర్శించారు. అది అవమానంగా భావించిన వేంకటశాస్త్రి సంస్కృత వ్యాకరణం నేర్చుకోవడానికివారాణసి వెళ్ళాలని నిశ్చయించుకొన్నారు. కాని ఆర్ధికమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. పై ఆయనకు పుట్టుకనుండి ఒక కన్నుకు సంబంధించిన సమస్య ఉండేది.

తరువాత వేంకట శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నపుడు తిరుపతి శాస్త్రితో పరిచయం ఏర్పడింది.
వేంకట శాస్త్రి అధ్యాపకునిగా ఉన్నపుడు ఆయన శిష్యులుగా ఉండి, తరువాత సుప్రసిద్ధులైనవారిలో కొందరు - విశ్వనాధ సత్యనారాయణ, వేటూరి సుందరరామ మూర్తి, పింగళి లక్ష్మీకాంతం. కాటూరి కవులు
మొదటినుండి తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి వినాయక చవితి ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది.

వేంకట శాస్త్రి వారాణసి వెళ్ళి తిరిగి వచ్చినాక కాకినాడ లో జంటగా శతావధానం ప్రదర్శించారు. తరువాత జీవితాంతం సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించారు.

ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. 'ధాతు రత్నాకరం' రచించారు. అడయారు వెళ్ళినపుడు అనీబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు,విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.

పోలవరం 
జమీందారు వారి ప్రతిభను గురించి తెలిసికొని ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన లైట్ ఆఫ్ ఆసియా గ్రంధాన్ని తెలుగులోకి అనువదించమని వారిని కోరారు. తన సంస్థానంలో కవులుగా చేరమని అర్ధించారు. విధమైన కట్టుబాట్లకు వేంకట శాస్త్రి వెనుకాడినా తిరుపతి శాస్త్రి ఆయనను ఒప్పించారు. ఫలితంగా వారు 1901లో కాకినాడకు నివాసం మార్చారు. 1889లో పిఠాపురం రాజు ప్రారంభించిన 'సరస్వతి' అనే సాహితీ పత్రిక నిర్వహణా బాధ్యతలు వారికి అప్పగింపబడ్డాయి. పత్రిక కోసం 'బాల రామాయణం', 'ముద్రారాక్షసం', 'మృచ్ఛఘటికం' గ్రంధాలను వీరు సంస్కృతంనుండి తెలుగులోకి అనువదించారు.
తిరుపతి వేంకట కవులు సంస్కృతంలోని రాజశేఖరుని బాలరామాయణాన్ని నాటకంగా ఆంధ్రీకరించారు. రామాయణ కథలో లేని ఎన్నో విషయాలను కొత్తగా కల్పించారు. విశాఖదత్తుని సంస్కృత ముద్రా రాక్షస నాటకాన్ని కూడా తిరుపతి వేంకట కవులు ఆంధ్రీకరించగా విశేష ప్రచారమును పొందింది. రెండు అనువాద నాటకాలలో తెలుగుదనం ఉట్టిపడేలా చేసి స్వతంత్ర నాటకాలనే భావాన్ని కలిగించారు. పాండవ కథా ప్రధానంగా ఆరు నాటకాలను రచించారు. మొదట పాండవ విజయము అనే పెద్ద నాటకాన్ని రచించి సరస్వతీ పత్రికలో ప్రచురించారు. కాలంలో వేణీ సంహారం నాటకానికి ధీటుగా నాటకం ఆంధ్ర దేశంలో విస్తృతంగా ప్రదర్శించబడింది. నాటకాన్ని తిరుపతి శాస్ర్తీగారు రచించారు. కానీ నాటకం కాలపరిమితి దాదాపు ఆరు గంటలకు పైగా నిడివి ఉండటంతో వెంకట శాస్ర్తీ తాను రాసిన కొన్ని అంకాలను కొత్తగా చేర్చి పాండవోద్యోగ విజయాలనే పేరున రెండు నాటకాలుగా విభజించారు. మిగిలిన భారత కథను పాండవాశ్వమేధం(1903), పాండవ ప్రవాసం (1907), పాండవ జననం(1908), పాండవ రాజసూయంఅనే నాటకాలను రచించారు. భారత కథను ఆరు నాటకాలుగా వ్రాసిన వారిలో ప్రథములుగా తిరుపతి వేంకట కవులు నిలిచారు.
పాండవ జననం నాటకమున శంతనుడు సత్యవతి వివాహము, భీష్మ పరశురాముల యుద్ధము, కర్ణజననం, పాండవ జననం మొదలైన ఘట్టాలతో రచింపబడింది. పాండవ ప్రవాసం ఎనిమిది అంకముల నాటకం, బకాసుర వధ, ద్రౌపదీ స్వయంవరం, ద్యూతము, ద్రౌపదీ వస్త్రాపహరణం సైంధవ పరాభవం ఉత్తరగోగ్రహణం వంటి ఘట్టాలతో రచింపబడింది. పాండవ రాజసూయం ఏకాంకిక, దశరూపకాలలో చెప్పబడిన వ్యాయోగ లక్షణాలన్నీ ఇందులో కనిపిస్తాయి. శిశుపాల వధ, రాజసూయ యాగం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. పాండవోద్యోగ విజయాలు తిరుపతి కవుల భారత నాటకాలలోనే కాకుండా తెలుగు నాటక రంగంలోనే తలమానికంగా ప్రదర్శింపబడని కుగ్రామము కూడా లేదంటే అతిశయోక్తి లేదు. ‘రాగం నేర్చిన ప్రతి నటుడూ పాండవోద్యోగాలలో ఏదో ఒక పాత్రను ధరించినవారే.’ తిరుపతి వేంకట కవుల భాష మృదుమధురమైనది. గద్యాన్ని వ్రాసినా, పద్యాన్ని వ్రాసినా శిష్ట వ్యావహారికం సరసమధురంగా చిందులు వేస్తుంది. జాతీయాలూ, లోకోక్తులు తిరుపతి వేంకట కవుల నాటకాలలో కుప్పలు తెప్పలుగా కన్పిస్తాయి. పాత్ర పోషణ, రస సంవిధానము, సన్నివేశ కల్పన, సంభాషణా చాతుర్యమునందు తిరుపతి వేంకట కవులు ప్రతిభ అనన్య సామాన్యమైనది. నాటకం అనే ప్రక్రియను వాడవాడలా పరిచయం చేయడంలో పాండవోద్యోగ విజయాల నాటకం ద్వారా తిరుపతి వేంకట కవుల కృషి చిరస్మరణీయం. ఉద్యోగ విజయాలను రెండింటినీ కలిపి కురుక్షేత్రం పేరుతో నటులు రాష్ట్రేతర ప్రాంతాలలో కూడా వేలాది ప్రదర్శనలిచ్చారు. ఇన్ని వేల ప్రదర్శనలను పొందిన నాటకం జాతీయ స్థాయిలో లేదంటే అతిశయోక్తి లేదు.
1918లో పోలవరం జమీందార్ మరణం వారిని ఇబ్బందులలో పడవేసింది. అయితే గోలంక వీరవరం జమీందార్ రావు రామాయమ్మ వీరికి భరణం ఏర్పాటు చేసింది.
పాండవోద్యోగ విజయాలు - పడక సీను
బావా! యెప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమంబై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్
బావ! ఎక్కడ నుండి రాక ఇటకు, ఎల్లరులున్ సుఖులే కదా?
ఎసోభాఖులు నీదు అన్నలున్, భవ్య మనస్కులు నీదు తమ్ములను చక్కగనున్నవారే ?
భుజసాలి వృకోదరుడు అగ్రజాగ్య్నకున్ దక్కగా నిల్చి
శాంతు గతి తానూ చరించునే తెలుపుము అర్జునా, ఎక్కడి నుండి రాక?
పాండవోద్యోగ విజయాలు - రాయబారం
చెల్లియొ చెల్లకొ తమకు జేసినయెగ్గులు సైచిరందరున్
తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధి సేయ, నీ
పిల్లలు పాపలుం ప్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో
యెల్లి రణంబు గూర్చెదవొ? యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా!

జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే
దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పు డొ
క్కండున్ నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్