11, డిసెంబర్ 2014, గురువారం

గాడిచర్ల హరిసర్వోత్తమ రావు --- ఆంగ్ల పదం editor(ఎడిటర్)కు తెలుగు లో సంపాదకుడు అనే పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.

ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు స్వాతంత్ర్య సమర యోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంధాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించారు. ఆంగ్ల పదం editor(ఎడిటర్)కు తెలుగు లో సంపాదకుడు అనే పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి.
1883 సెప్టెంబర్ 14 న కర్నూలు లో భాగీరథీ బాయి, వెంకటరావు దంపతులకు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు జన్మించారు.వారిది పేద కుటుంబం. కర్నూలు, గుత్తి, నంద్యాల లో ప్రాధమిక, ఉన్నత విద్య చదివారు. ఇంకా చదువుకునే ఆర్ధికస్తోమత లేకున్నప్పటికీ, ప్రతిభా పారితోషికాల సహాయంతో 1906 లో మద్రాసు లో ఎం.ఏ డిగ్రీ పూర్తి చేసారు. తరువాత రాజమండ్రి లో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా, 1907 లో స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రవేశించారు. రాజమండ్రిలో బిపిన్ చంద్ర పాల్ చేసిన ఉపన్యాస స్ఫూర్తితో విద్యార్ధులంతా వందేమాతరం బ్యాడ్జిలు ధరించి తరగతికి వెళ్ళారు. వీరికి నాయకుడైన సర్వోత్తమ రావును కళాశాల నుండి బహిష్కరించడమే కాక, ఆయనకు ఎక్కడా ఉద్యోగమివ్వరాదని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఆ తరువాత ఆయన పత్రికా రంగంలోకి అడుగు పెట్టారు. స్వరాజ్య అనే తెలుగు పత్రికను ప్రారంభించి, బ్రిటిషు పాలనపై విమర్శలు ప్రచురించేవారు. 1908 లో తిరునెల్వేలి లో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినపుడు విపరీత బుద్ధి (Cruel Foreign Tiger) అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం కోపించి, ఆయనకు మూడేళ్ళ ఖైదు విధించింది. ఆ విధంగా ఆయన ఆంధ్రులలో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యారు. వెల్లూరు జైలులో, బందిపోట్లు, గజదొంగలూ ఉండే గదిలో ఆయనను బంధించి, అమానుషంగా వ్యవహరించింది, బ్రిటిషు ప్రభుత్వం. జైలు నుండి విడుదల అయ్యాక కూడా ఆయనపై ప్రభుత్వ నిఘా ఉండేది. ప్రజలు ఆయనతో మాట్లాడటానికి కూడా భయపడేవారు.

1914 లో బాల గంగాధర తిలక్ యొక్క హోం రూల్ లీగ్ కు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా విస్తృతంగా ప్రచారం చేసారు. 1924 లో కాకినాడ లో జరిగిన కాంగ్రెసు సభల సమయంలో హిందూస్థానీ సేవా దళ్ ఏర్పాటులో ఆయన ప్రముఖపాత్ర వహించారు. 1927 లో కాంగ్రెసు అభ్యర్ధిగా నంద్యాల నియోజక వర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యునిగా కూడా పనిచేసారు.

1930 నుండి రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకుంటూ, తనకెంతో ప్రీతిపాత్రమైన గ్రంధాలయోద్యమం వైపు దృష్టి మరల్చారు. ఆంధ్ర గ్రంధాలయ సంస్థకు 1934 నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నారు. గ్రంధాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు ఉపయోగపడే పుస్తకాలు రచించారు. వారికి శిక్షణా శిబిరాలు నిర్వహించారు.

ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 1952 లో జరిగిన అఖిలపక్ష సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. దాని తరపున రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేసారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక, సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కూడా చూసి, 1960 ఫిబ్రవరి 29 న గాడిచర్ల హరిసర్వోత్తమ రావు మరణించారు. ఆయన స్మారకార్ధం విజయవాడలో సర్వోత్తమ భవనం వెలసింది.
పత్రికా రచయితగా, సంపాదకుడిగా, పుస్తక రచయితగా ఆయన చేసిన కృషి బృహత్తరమైనది.తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, మరాఠీ మొదలైన భాషలు కూడా ఆయబకు వచ్చేవి.ఎం.ఏ చదివే రోజుల్లోనే మొదలైన ఆయన సాహితీ వ్యాసంగం, జీవితాంతం కొనసాగింది. ఎన్నో కొత్త పదాలు సృష్టించారు. ఆయన సాహిత్య కృషిలో కొన్ని విశేషాలు:
• ప్రముఖ దినపత్రిక ఆంధ్ర పత్రిక కు ఆయన తొలి సంపాదకుడు. 1916 నుండి 1918 వరకు ఆయన సంపాదకుడుగా ఉన్నారు.
• ది నేషనలిస్ట్, మాతృసేవ, ఎడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, కౌముది, ఆంధ్రవార్త అనే పత్రికలకు కూడా సంపాదకత్వం నిర్వహించారు.
• మహిళల సమస్యలు పరిష్కరం కోసం " సౌందర్యవల్లి " అనే పత్రిక నడిపారు.
• మద్రాసు గ్రామ పంచాయితీ అనే పత్రిక యొక్క తెలుగు, తమిళ, ఇంగ్లిషు ప్రతులకు సంపాదకుడిగా ఉన్నారు.
• జి.హెచ్.ఎస్ పేరుతో హిందూ పత్రికకు వ్యాసాలు రాసారు.
• స్పిరిట్యువల్ స్వదేశీ నేషనలిజం అనే పుస్తకం రాసారు.
• ఆయన రాసిన శ్రీరామ చరిత్ర అనే పుస్తకాన్ని 11 వ తరగతికి ఉపవాచకంగా ప్రభుత్వం తీసుకున్నది.
• ఆయన రచించిన పౌరవిద్య అనే పుస్తకాన్ని మద్రాసు ప్రభుత్వం 1 నుండి 6 తరగతుల వరకు పాఠ్యపుస్తకం గా నిర్ణయించింది.

తన సాహిత్య కృషిలో భాగంగా హరి సర్వోత్తమ రావు కొత్త పదాలను సృష్టించారు. మచ్చుకు కొన్ని:
• రాయలసీమ కు ఆ పేరు పెట్టింది ఆయనే. 1928లో కర్నూలు జిల్లా నంద్యాల లో జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టారు. అప్పటి వరకు దీనిని దత్తమండలం (Ceded) అని పిలిచేవారు.
• రాయలసీమ పేరును మొదట సూచించింది చిలుకూరి నారాయణరావు. నాడు జరిగిన సభలో గాడిచర్ల,చిలుకూరు నారాయణ రావు చేసిన సూచనను ప్రతిపాదించారు. అప్పటికే రాయలసీమ పదం పరివ్యాప్తి చెంది ఉండడంతో సభ అందుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.
• సంపాదకుడు, భావకవిత్వం అనే పదాలను పరిచయం చేసింది కూడా ఆయనే.
• ఎం.ఏ డిగ్రీ పొందిన ఆంధ్రులలో ఆయన రెండవవారు.
• గాడిచర్ల గురించి ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు చెప్పిన చిరు కవిత:
“వందేమాతరమనగనే వచ్చి తీరు ఎవని పేరు?
వయోజన విద్య అనగనే వచ్చి తీరు ఎవని పేరు?
గ్రామగ్రామమున వెలసెడి గ్రంధాలయమెవనికి గుడి?
అరగని తరగని వొడవని అక్షర దానంబెవనిది?
అరువదేండ్లు ప్రజల కొరకు అరిగిన కాయం బెవనిది?
తన బరువును మోయలేని తనువును చాలించెనెవడు?
తరతరాలు ఎవని మేలు తలచుచు పొరలుచు నుండును?
అందరికెవనితొ పొత్తు - అఖిలాంధ్రంబెవని సొత్తు?
ఏస్థాన కవిని నేనో, ఆ స్థానాధీశుడెవడు?
వయోవృద్ధుడగు యువకుడు, వాస్తవ జీవితమతనిది
హరిసర్వోత్తముడాతడు, ఆంధ్రులపాలిటి దేవుడు”

తనను విమర్శించిన హరిసర్వోత్తమ రావును గురించి మహాత్మా గాంధీ అన్న మాట: ది బ్రేవ్ సర్వోత్తమ రావ్

1 కామెంట్‌:

  1. గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి గురించి మీ వ్యాసం బాగుంది. ఆయన గ్రంధాలయోద్యమ నాయకులని తెలుసు గాని, ఇప్పుడు మీ వ్యాసం ద్వారా ఆయన జీవిత విశేషాలు మరిన్ని తెలిశాయి. కాకపోతే ఈయన గురించి మీ బ్లాగులో ఇదివరలో ఒకసారి - ఫిబ్రవరి 2014 లో - పరిచయం వ్రాశినట్లున్నారు (నేను మీ బ్లాగు ఇప్పుడే పూర్తిగా చూస్తుంటే కనిపించింది).

    మరో సందేహం. ఎం.ఏ డిగ్రీ పొందిన ఆంధ్రులలో వీరు రెండవ వ్యక్తి అని వ్రాశారు. మొదటి వ్యక్తి ఎవరన్నది కూడా తెలుపగలరా? (సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారేమోనని నేను అనుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా తెలియదు. కరక్టేనా?)

    రిప్లయితొలగించండి