15, డిసెంబర్ 2014, సోమవారం

బాపు --- బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి

బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం.
బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933  సంవత్సరం లో పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలం కంతేరు లో వేణు గోపాల రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించారు.
'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ధి గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హృద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది.
కొంటెబొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
కూనలమ్మా!
ఇలా కూనలమ్మ పదం వ్రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతివ్రాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు.ఆయనకు చిత్రలేఖనం అంటే ఎంతో ఇష్టం. 1942లో అప్పటి మద్రాసులోని పీఎస్ హైస్కూల్లో ఐదు, ఆరు తరగతులు కలిసి చదువుకున్నప్పటి నుంచి బాపు, రమణల మధ్య స్నేహం పరిమళించింది. అది చివరి వరకూ కొనసాగింది. పాఠశాల రోజుల్లోనే 'బాల' అనే చిన్నపిల్లల మ్యాగజైన్కు 'అమ్మమాట వినకపోతే' అనే కథను రమణ రాస్తే, దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది. పత్రికల్లో కార్టూనిస్ట్గా బాపు బొమ్మలు వేసేవారు. బాపు బొమ్మ ప్రత్యేకమైనది. ఆయన రాత కూడా అంతే. బాపు బొమ్మల గురించి అందరికీ తెలుసు... కానీ బొమ్మలపై రాత కూడా బాపు అక్షరాలే అని రమణ చెప్పేవరకూ చాలా మందికి తెలీదు. రమణ రాత, బాపు గీతలో వెలువడ్డ 'కోతికొమ్మచ్చి' 'బుడుగు'లు తెలుగు సాహితీవనంలో ఎన్నటికీ వాడిపోని అక్షర సుమాలు. దర్శకుడిగా బాపు మొదటి చిత్రం సాక్షి. తరువాత ఆయన ఎన్నో వైవిధ్యమైన దృశ్య కావ్యాలను వెండితెరపై సృష్టించారు. అందులో 'ముత్యాలముగ్గు' సినిమాను తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు
ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతో పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపొయాయనటం పొగడ్త కాదు.
క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా, తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది, తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ప్రతిభావంతుడి సొత్తు.
1955 సంవత్సరం లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నారు. అదే సంవత్సరం ఆంధ్ర పత్రిక దినపత్రికలో వ్యంగ్య చిత్రకారునిగా చేరారు.
బాపు చిత్రకళ ఒక విషయానికి పరిమితంకాలేదు. 1945 నుండి బాపు చిత్రాలనూ, వ్యంగ్యచిత్రాలనూ, పుస్తకాల ముఖచిత్రాలనూ, పత్రికల ముఖచిత్రాలనూ, కథలకు బొమ్మలనూ, విషయానుగుణ చిత్రాలనూ పుంఖాను పుంఖాలుగా సృష్టిస్తున్నారు. కొత్త రచయితలూ, ప్రసిద్ధ రచయితలూ, పురాణాలూ, జీవితమూ, సంస్కృతీ, రాజకీయాలూ, భక్తీ, సినిమాలూ - అన్ని రంగాలలో ఆయన గీతలు వాసికెక్కాయి. ఆయన చిత్రాలతో ఉన్న శుభాకాంక్ష పత్రికలు (గ్రీటింగ్ కార్డులు), పెళ్ళి శుభలేఖలూ కళాప్రియులు కోరి ఏరుకుంటారు.
బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ప్రాముఖ్యత అందలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్) ఎన్నో డి.టి.పి సంస్థలూ, ప్రచురణా సంస్థలూ వాడుతుంటాయి.
నవరసాలు, అష్టవిధనాయికలు, జనార్దనాష్టకము, అన్నమయ్య పాటలు, రామాయణము, భారతీయ నృత్యాలు, తిరుప్పావై - ఇలా ఎన్నో విషయాలపై బాపు ప్రత్యేక చిత్రావళిని అందించారు. ఆయన చిత్రాలలో కొన్ని ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి.
·         పొదుపుగా గీతలు వాడటం.
·         ప్రవహించినట్లుండే ఒరవడి
·         సందర్భానికి తగిన భావము
·         తెలుగుదనము
బాపు కొతకాలం జె.వాల్టర్ థామ్సన్ సంస్థలోనూ, ఎఫిషియెంట్ పబ్లికేషన్స్ లోనూ, ఎఫ్.డి. స్టీవార్ట్స్ సంస్థలోనూ పని చేశారు. బాపు కృషిలో సహచరుడైన ముళ్ళపూడి వెంకటరమణ తో కలిసి రూపొందించిన బుడుగు పుస్తకం తెలుగు సాహిత్యంలో ఒక క్లాసిక్. ఇందులో బుడుగు తో పాటు సిగానపెసూనంబ తెలుగువారి హృదయంలో చిరకాలస్థానం సంపాదించుకొన్నారు. ఆయన చిత్రాలు దేశదేశాలలో ఎన్నో ప్రదర్శనలలో కళాభిమానుల మన్నలందుకొన్నాయి.
1967లో సాక్షి (సినిమా) చిత్రదర్శకునిగా సినిమారంగంలో అడుగుపెట్టిన బాపు మొదటి చిత్రంతోనే ప్రసంసలు అందుకొన్నారు. అయన మొత్తం 41 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1976 లో వెలువడిన 'సీతాకల్యాణం' సినిమా చూసేవారికి కన్నుల పండుగ. ముఖ్యంగా అందులో గంగావతరణం సన్నివేశం మరువరానిది.
బాపు తను తీయబోయే చలన చిత్రపు సన్నివేశాలను సచిత్రంగా ( స్టోరీబోర్డు ) తయారు చేసుకుని తెరమీదకి ఎక్కిస్తారు. విధానం వలన తను మనసులో అనుకున్నది కాగితం మీద ఎంత అందంగా చిత్రీకరించుకుంటాడో అంతే అందంగా తెరమీద గందరగోళం లేకుండా చిత్రీకరించగలుగుతారు.
బాపుకు స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి,ఆయన తీసిన సీతాకల్యాణం సినిమా లండన్లో జరిగిన ఫిలిం ఫెస్టివల్, షికాగో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. అందులో ముఖ్యమయినవి కొన్ని.
·         బాపు దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (1975 సంవత్సరం) భారత ప్రభుత్వ పురస్కారం తో పాటు సినిమాటోగ్రాఫర్ ఇషాన్ అర్యాకి ఛాయగ్రాహకుడిగా పురస్కారం.
·         1986 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి .పి కళా వేదిక ద్వారా రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం మదర్ థెరిస్సా బహూకరించగా తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకట రమణ తో కలిసి స్వీకారం.
·         చెన్నై(తమిళనాడు) లో స్థాపించిన శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి ప్రతిష్ఠాత్మకమయిన రాజ్యలక్ష్మి పురస్కారం 1982  సంవత్సరంలో ఇవ్వబడింది.
·         1991 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ బహూకరణ.
·         1992 సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్  వారిచే శిరోమణి పురస్కారం అమెరికాలో స్వీకరణ.
·         మిస్టర్ పెళ్ళాం సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ పురస్కారం.(1993 సంవత్సరం).
·         1995 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా  వారిచే తెలుగు చిత్ర కళా, సాహిత్య, సాంస్కృతిక, సినిమా రంగాలకు తన ఏభై సంవత్సరాల(గోల్డెన్ జూబ్లీ సెలేబ్రషన్) సేవకు గాను ఘన సన్మానం.
·         బాపు మీద ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు వంశీ తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి 1996  సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.
·         9 జూన్, 2001 సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్  వారిచే జీవిత సాఫల్య పురస్కారం తో సన్మానం.
·         2 జూన్, 2001 సంవత్సరంలో డిసెంబరు  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే విశిష్ట పురస్కారంతో గౌరవం.
·         అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి వారిచే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా అవార్డు బహూకరణ.
·         బాలరాజు కథ (1970), అందాల రాముడు (1973), ముత్యాల ముగ్గు (1975), పెళ్లి పుస్తకం (1991), మిస్టర్ పెళ్ళాం (1993), శ్రీరామరాజ్యం (2011) సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారాలు.
·         2013 కు గానూ ప్రకటించిన పద్మ పురస్కారాలలో కళల విభాగంలో తమిళనాడు రాష్ట్ర విభాగంలో పద్మశ్రీ పురస్కారం.

బాపు చిత్రకారునిగా పలు పుస్తకాలకు ముఖచిత్రాలు వేశారు. పత్రికల్లో కథలకు, నవలలకు ఆయన వేసిన చిత్రాలు మౌనవ్యాఖ్యలుగా అమరాయి అని విమర్శకులు బాపు బొమ్మల్ని ప్రశంసించారు. అమరావతి కథలు ముందుమాటలో సత్యం శంకరమంచి రాసిన కథలతో పాటు కథలకు బాపు వేసిన చిత్రాలను గురించి కూడా ముళ్ళపూడి వెంకటరమణ సమాన ప్రాధాన్యతతో విశ్లేషించారంటే వాటి ప్రభావాన్ని గురించి అంచనా వేయవచ్చు. వంశీ "మా పసలపూడి కథలు", పుట్టపర్తి నారాయణాచార్యుల "శివతాండవం" వంటి ఎన్నో రచనలకు బాపుబొమ్మలు అదనపు విలువను తీసుకువచ్చాయని చేప్తూంటారు. బాపు రచనలను పూర్తిగా చదివి, రచయిత హృదయాన్ని అవగతం చేసుకుని వేసే బొమ్మలు సాహితీలోకంలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పలువురు రచయితలు తమ రచనలు బాపుబొమ్మలతో ప్రచురణ పొందడాన్ని సార్థకతగా భావిస్తారంటే అతిశయోక్తి కాదు. శ్రీరమణ రచించిన ప్రఖ్యాత "మిథునం" కథ ఎంతగానో నచ్చడంతో బాపు దాన్ని తన దస్తూరిలో తిరగరాసి ఒక ప్రశంసగా రచయితకు పంపారు. తరువాత కాలంలో దస్తూరీ తిలకం పేరిట కథను బాపు దస్తూరిలో ఆయన కథకు వేసిన పలు బొమ్మలతో ప్రచురించారు. సాహిత్యంలో బాపును గురించి పలు ప్రస్తావనలు వచ్చాయి. ముళ్ళపూడి వెంకటరమణ రాసిన ఆత్మకథ కోతికొమ్మచ్చిలో రమణ ఆప్తమిత్రుడైన బాపు జీవితాగమనం కూడా రాశారు. అందుకే ఇది తన ఒక్కడి ఆత్మకథే కాదని తన ఆత్మబంధువైన బాపు కథ కూడా అని రమణ పలు సందర్భాల్లో ప్రకటించారు. సాహిత్యరంగంతో ఇంతటి సన్నిహిత సంబంధాలున్న బాపు స్వయంగా కథా రచన చేశారు. తన ఆప్తమిత్రుడు ముళ్లపూడి వెంకటరమణ కథారచన చేయక ముందు ఆయనను ఉత్సాహపరిచేందుకు "లక్ష్మి" అన్న కథను ముళ్లపూడి వెంకట్రావు(రమణ అసలుపేరు) పేరిట రాశారు. ఆపై మరో కథ సత్తిరాజు లక్ష్మీనారాయణ(బాపు అసలుపేరు) పేరుతో రాయగా, మూడో కథ "మబ్బూ వానా మల్లెవాసన" బాపుగా రాశారు. మూడు కథల్లోనూ "మబ్బూ వానా మల్లెవాసన" బహుళ ప్రాచుర్యం పొంది ఉత్తమ కథగా నిలిచింది. యువకుడు దాంపత్యజీవితం పట్ల కనే కలలు నిజజీవితంలో జీవిత భాగస్వామికీ అతనికీ ఉన్న అభిరుచి భేదాలు, వాటివల్ల కలిగే చిన్న చిన్న ఆశా భంగాలు వంటివి ఎంతో మనోహరంగా రచించారు. కథ పలుమార్లు పత్రికల్లో పునర్ముద్రణ పొంది, "తెలుగు కథకు జేజే" సంకలనంలోనూ చోటుచేసుకుంది. తన కార్టూన్లలో, గ్రాఫిటీ స్ట్రిప్ లలో సందర్భానుసారం వచ్చే సంభాషణలు, వ్యాఖ్యలు బాపు రాశారు. బాపు వాక్యాలు సునిశితమైన వ్యంగ్యం, సున్నితమైన హాస్యం కలగలిసిన వచనంలో సమకాలీన వ్యవహారికం, అచ్చ తెలుగు నుడికారం పోతపోసినట్టు ఉంటాయి. బాపు-రమణల స్నేహాన్ని పురస్కరించుకుని సామాన్య పాఠకుల్లో కార్టూన్లలో "బాపూది గీత రమణది రాత" అనే ప్రథ వ్యాపించి ఉండగా కార్టూన్లలో రాత, గీత బాపుదేనని రమణ నిక్కచ్చిగా తేల్చారు. వీటన్నిటినీ పురస్కరించుకుని బాపును ఉత్తమ పాఠకుని గానే కాక నిశితమైన సాహితీ విమర్శకునిగా, విలక్షణమైన వచనం రాయగల సాహితీకారునిగా భావించవచ్చు.

అనారోగ్యంతో బాధపడిన బాపు చెన్నైలోని మలార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ . 2014, ఆగష్టు 31 గుండెపోటుతో మరణించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి