17, జులై 2014, గురువారం

పుట్టపర్తి నారాయణాచార్యులు ---- ఏమానందము భూమీతలమున శివతాండవమట శివలాస్యంబట



పుట్టపర్తి నారాయణాచార్యులు తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి . ఇంత హొయలుగా గేయం సాగడానికి వారికి తప్పక సంగీత పరిజ్ఞానం ఉండాల్సిందే. నిజానికి సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన పలుకు పలుకులో మధురిమ ఒలుకుతుంది.ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు.
పద్నాలుగేళ్ల వయసులో పెనుగొం డలక్ష్మిఅనే పద్యకావ్యాన్ని రచించి అనతికాలంలోనే సంస్కృత, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు హిందీ, మరాఠీ, బెంగాలీ, పార్శీ, ఫ్రెంచ్, ఆంగ్లభాషల్లో ప్రావీణ్యాన్ని సాధించిశివతాండవం’, ‘శ్రీనివాస ప్రబంధంవంటి వందకు పైగా గ్రంథాలను రచించిన ఘనతసరస్వతీ పుత్రపుట్టపర్తి నారాయణాచార్యులకే సొంతం.
1914 మార్చి 28న అనంతపురం జిల్లా, పెనుగొండ సమీపంలోని చియ్యేరు గ్రామంలో విద్యావంతుల కుటుంబంలో పుట్టపర్తి నారాయణాచార్యులు జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి(ķóndamma) గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. [[శ్రీకృష్ణదేవరాయలరాజగురువు) తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. ఆయన గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది. ప్రాథమిక విద్య అనంతరం సంస్కృతంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి పదహారవ ఏట తిరుపతి ఓరియంటల్ కళాశాలలో చేరడానికి దరఖాస్తు చేసుకున్న పుట్టపర్తికి ప్రవేశం దొరకలేదు. దాంతో దెబ్బతిన్న అభిమానంతో కళాశాల ప్రిన్సిపాల్ ఎదుటే ఐదు శ్లోకాలను సంస్కృతంలో ఆశువుగా చదివి, నిష్ర్కమించిన పుట్టపర్తి కవితా ధారణను చూసి సంబరపడ్డ ప్రధానాచార్యులు, ఆయన కోరిన తరగతికన్నా పైతరగతిలో ప్రవేశం కల్పించారు.

1938
లో నారాయణాచార్యులు విద్వాన్పరీక్షకు హాజరయినప్పుడు, తాను రచించిన పెనుగొండలక్ష్మిపద్య కావ్యం పాఠ్యగ్రంథంగా దర్శనమివ్వడం ఓ అసాధారణ సన్నివేశం. ‘‘ఇలాంటి అనుభవం ఎదురుకావడం కన్నా గొప్ప గుర్తింపు, ఒక సాహితీవేత్తకు మరేముంటుంది’’! అంటూ పుట్టపర్తి ఎంతగానో సంబరపడ్డారు. షాజీఅనే మరో గ్రంథాన్ని పుట్టపర్తి అతి చిన్న వయసులోనే రచించి కనీవినీ ఎరుగని ఓ కొత్త రికార్డు సృష్టించారని విమర్శకులంటారు. తెలుగు తీరాలు, మేఘదూతము, సాక్షాత్కారము, అగ్నివీణ, గాంధీజీ ప్రస్థానం వంటివి వీరి రచనల్లో కొన్ని. విశ్వనాథ రచించిన ఏకవీరనవలను నారాయణాచార్యులు మలయాళంలోకి అనువదించారు. పుట్టపర్తి రచనలన్నిటిలోకిశివతాండవంగొప్ప కీర్తిప్రతిష్టలను సంపాదించింది. గంభీర స్వరంతో భావోద్వేగంతో ఆయన శివతాండవం గానం చేస్తుంటే, జనం పులకించిపోయేవారు. 1974లో భారత ప్రభుత్వం పద్మశ్రీబిరుదుతో పుట్టపర్తి నారాయణాచార్యులను సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన పుట్టపర్తిని, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కవిగా, విమర్శకుడిగా, వాగ్గేయకారుడిగా, అనువాదకుడిగా, వ్యాఖ్యాతగా, అవధానిగా తెలుగు సాహితీక్షేత్రంలో విశేష ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించిన నారాయణాచార్యులు అపర సరస్వతీ పుత్రులు. తెలుగు సాహిత్యంలో ఆయన కీర్తి అజరామరం. ‘‘నాకు మంత్రోపాసన వల్ల ఏమీ తృప్తి కలగలేదు. దానితోపాటు గృహఛిద్రాలు నన్ను కలవరపెట్టాయి. దేశంలోని సన్యాసులందర్నీ కలవాలని ఉంది’’ అంటూ బెనారస్, హరిద్వార్, హిమాలయాల గుండా రుషీకేశ్ దాకా కాలినడకన పర్యటించి, హృషీకేశ్ లో ఆయన పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి ఆయనకు "సరస్వతీపుత్ర" బిరుదునిచ్చారు. ఆయనకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి ఆయన ఉంచుకున్నారు.
ఆయన బహుభాషావేత్త, అనేక భాషల్లో పండితులు. తుళు, ఫ్రెంచి, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. పుట్టపర్తి ఆనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ కావ్యాలను తెలుగులోనికి అనువదించారు."లీవ్స్ ఇన్ ది విండ్", దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన "ది హీరో" ఆంగ్లంలో ఆయన స్వంత రచనలు. ఆయన ఆంగ్లంలో మరిన్ని రచనలు చేసి ఉండేవారే. ఆయనకు ఆంగ్లం నేర్పిన వి.జె. పిట్ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో బ్రౌనింగ్ పై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందింది. అప్పట్లోనే ఈయన వ్రాసిన లీవ్స్ ఇన్ ది విండ్ కావ్యం చూసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పెద్ద కితాబు ఇచ్చారు.
ఆయన చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేశాడంటే చరిత్రకారులకు ఆయన్ను పట్ల గొప్ప గౌరవముండేది. ఒకసారి ఆయనకు కమ్యూనిస్టులు సన్మానం చేసినప్పుడు ఆంధ్రుల చరిత్రలో గాఢమైన అభినివేశమున్న మల్లంపల్లి సోమశేఖరశర్మ "ఆయన్ను కవిగా కంటే చారిత్రకునిగా గౌరవిస్తానని" సందేశం పంపాడు. తర్వాత పుట్టపర్తి చారిత్రకులను ఇరుకున పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ "సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు అని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాల గాడు?" అని అడిగి, ఆయన దిగ్భ్రాంతుడై నిలబడి పోతే, తనే సమాధానం చెప్పాడు~: "కృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళు వంశం, ఇంటివాళ్ళు సంపెట వాళ్ళూ" అని.
భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చింది. ఆయితే ఆయన నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్నివిధాలా అర్హులనీ, ఆయనకు ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమనీ పలువురు పండితులు భావిస్తారు. గుర్రం జాషువా "పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు?" అని ప్రశ్నించాడు. దేశంలోని అన్ని ప్రాంతాలలో, హైదరాబాదు, చెన్నై, కలకత్తా లాంటి అన్ని నగరాలలో ఆయన సత్కారాలు పొందారు. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్. ప్రదానం చేశాయి. ఆయన కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పని చేసి1990 సెప్టెంబర్ 1, 76వ ఏట కన్నుమూశారు.

రచనలు

కేవలం పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని ఐన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా "పెనుగొండ లక్ష్మి" అనే గేయ కావ్యం రాశాడు. చిత్రంగా తర్వాత ఆయన విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. దానికి కారణం "పెనుగొండ లక్ష్మి" కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూఉండిపోవడంతో సమయం అయిపోవడం. ఆ ప్రశ్నకు "పూర్తి" మార్కులు (అంటే 2 మార్కులు) వచ్చినా ఆ మార్కులతో ఆయన పాస్ కాలేకపోయారు. ఆయన బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.
తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ నవల ఏకవీర ను మలయాళం లోనికి అనువదించాడు. పండితులు ఒకరి పాండిత్యాన్ని మరొకరు మెచ్చరని అంటారు. కాని పుట్టపర్తివారి విషయంలో మాత్రం దీనికి విరుద్దం. ఒక సారి విజయవాడలో పుట్టపర్తి తన "శివతాండవం" గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఆనంద పరవశుడై ఆయనను భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరాడు. ఇంకొక సారి వైజాగ్ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం ఐపోయాక ప్రాకృత భాషలలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశారు.
తెలుగులో ఆయన వ్రాసిన "శివతాండవం" ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. దీనిని అనేకమంది పండితులు ఆధునిక మహా కావ్యంగా అభివర్ణిస్తారు. ఇది ఆరు భాగాలుగా ఉంది. దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ శివతాండవం గానం చేయమనే వారు. తెలుగు అర్థం కాని వారు సైతం ఆ మాత్రాచ్ఛందస్సు లోని శబ్దసౌందర్యానికి పరవశులయ్యేవారు. ఆయన గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని ఆయన స్వయంగా గానం చేయగా విన్న వాళ్ళు "ఆ శివుడు ఆడితే చూడాలి-ఆచార్యులవారు పాడితే వినాలి" అని భావించేవారు.
మచ్చుకు :
కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ
నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ
నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల
తుందిలా కూపార తోయపూరము దెరల
చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప
నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప
వన కన్యకలు సుమాభరణములు ధరియింప
వసుధ యెల్లను జీవవంతంబై బులకింప
ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!
ఆయన 140 పైగా గ్రంధాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల ఆయన రచనల్లో కొన్ని "వ్యాసవల్మీకం", మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మ తో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.

ఆయన వ్రాసిన అనేక కృతుల్లో కొన్ని దిగువ ఇవ్వబడినవి.
తెలుగులో స్వతంత్ర రచనలు.
పెనుగొండ లక్ష్మి, షాజీ, మేఘదూతము, సాక్షాత్కారము, పండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్), శ్రీనివాస ప్రబంధమ్, ఆగ్నివీణ, ప్రబంధ నాయకులు, పాద్యము, సిపాయి పితూరీ, గాంధీ ప్రస్థానం, క్రాంతి సందేశం, అనురాగం, ఆశ, స్మృతి, ఓదార్పు, ఎడబాటు, వీడుకోలు, ఆంధ్ర భారతోపన్యాసాలు, భాగవతోపన్యాసాలు, రామకృష్ణుని రచనా వైఖరి, వసుచరిత్ర విమర్శనమ్, విజయనగర రాజ్య సాంఘిక చరిత్ర, మొదలైనవి 7,000 కృతులు
ఆంగ్లంలో స్వతంత్ర రచనలు
  • లీవ్స్ ఇన్ ది విండ్.
  • ది హీరో
మలయాళంలో స్వతంత్ర రచనలు
  • మలయాళ నిఘంటువు
సంస్కృతంలో స్వతంత్ర రచనలు
  • త్యాగరాజ స్వామి సుప్రభాతం.
  • చెన్నకేశవ సుప్రభాతం.
  • శివకర్ణామృతం

అనువాదాలు

  • హిందీ నుండి:కబీర్ గీతాలు(కబీర్ వచనావళి,ఎన్.బి.టి ప్రచురణ)
  • మరాఠీ నుండి:భగవాన్ బుద్ధ
  • మలయాళం నుండి:స్మశానదీపం
  • మలయాళం లోకి:ఏకవీర
  • ఇంగ్లిషు లోకి:భాగవతం

ప్రముఖుల అభిప్రాయాలు

  • పుట్టపర్తి వారిలాగ బహుభాషల్లో, బహుశాస్త్రాల్లో పండితులైన వారు, కవిత్వంతో బాటు విమర్శనారంగంలో కూడా అనన్యమైన ప్రతిభ చూపిన వారు నేటితరంలో కనిపించరు. జ్ఞానపీఠం వంటి గౌరవానికి వారు నిజంగా అర్హులు. కానీ అది తెలుగువారి దురదృష్టం వల్ల వారికి లభించలేదు. -భద్రిరాజు కృష్ణమూర్తి
  • శివతాండవం విన్నప్పుడు తుంగభద్రాప్రవాహంలో కొట్టుకు పోతున్నట్లనిపించింది. తర్వాత మేఘదూతం చదివాను. ఇది నా దృష్టిలో శివతాండవం కంటే గొప్ప రచన. -రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
  • ఆధునిక సారస్వతమున శివతాండవం వంటి గేయకృతి ఇంకొకటి లేదు. -తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి
  • కవిత్వాన్నీ, పాండిత్యాన్నీ కలగలిపి ఔపోశన పట్టిన అగస్త్యుడు. -సి. నారాయణ రెడ్డి
  • ఎవని పదమ్ములు శివ తాండవ లయాధిరూపమ్ములు
ఎవని భావమ్ములు సుందర శివాలాస్య రూపమ్ములు
అతడు పుట్టపర్తి సూరి! అభినవ కవితా మురారి!!
...
పుట్టపర్తి ధిషణకు జైకొట్టగ మనసాయె నాకు.
కలితీ కనరాని క్షీరకళలు చిలుకు అతని పలుకు
వెలితి ఎరుగలేని కడలి పొలుపు తెలుపు అతని తలపు
వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు
రక్తికి భక్తికి సేతువు రచియించిన రసికుడతడు!!! -సి. నారాయణ రెడ్డి



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి