31, మే 2014, శనివారం

డొక్కా సీతమ్మ --- అన్నమో రామచంద్రా' అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు డొక్కా సీతమ్మతల్లి.



 అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అని అంటారు. ఎందుకంటే, ఆకలికి కులమత బేధాలు లేవు, ధనిక, పేదల తేడాలు లేవు. అందరినీ సమానంగా బాధించేది ఆకలి బాధ. ధనం ఉండి కూడా ఆకలి బాధ బారినుండి తప్పించుకోలేం, ఒక్కొక్కసారి. అటువంటి ఆకలి బాధితులను ఆపన్న సమయంలో ఆదుకున్న మహిళా శిరోమణే శ్రీ మతి డొక్కా సీతమ్మ గారు.
అన్నమో రామచంద్రా' అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు డొక్కా సీతమ్మతల్లి. ఆమె చదువుసంధ్యలు లేని సాధారణ స్త్రీ. ఆమె తాను అన్నదానంచేసి విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి . భారతీయ సంప్రదాయంలో ' అన్నం పరబ్రహ్మ స్వరూపమ్ ' అని పేర్కొనడం మనం వింటున్నాం ! అన్నదానానికి మించిన దానంలేదని విశ్వసించి ఆకలిగొన్న వారికి అన్నం పెట్టడమేధ్యేయంగా 'అతిదిదేవోభవ' అన్నపదానికి ఉదాహరణగా నిలిచినవ్యక్తి ఆమె . ఆంద్ర దేశపు కీర్తి పతాకను ఇంగ్లండు వరకు వ్యాపింపజేసిన, మాతృప్రేమను అతిధులకుపంచి జీవితాన్ని చరితార్డం చేసుకున్న అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. ఆమె కేవలం అన్న దానమే కాదు, ఎన్నో శుభాకార్యాలకూ విరాళాలు యిచ్చిన దాత కూడా.
తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ది చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్థంగా కల డెల్టా ప్రాంతములోని డెల్టాగన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇల్లాలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతములలో తరచు వచ్చే వరద కారణంగానూ అతివృష్టి, అనావృష్టి ల కారణంగానూ పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకొంటూ, వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానము జరిపిన మహాఇల్లాలు.
నిస్వార్ధంగా జాతి, కుల, మత విచక్షణ చూపించకుండా అన్నార్తులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్ధం చేసుకున్న 'అపర అన్నపూర్ణమ్మ'మన డొక్కా సీతమ్మ గారు! అచిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాలలో 'అపర అన్నపూర్ణ' గా శ్రీమతి సీతమ్మ గారు పేరుపొందారు
తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రాపురం తాలుకా, మండపేట గ్రామంలో 1841 అక్టోబరు రెండోవారంలో సీతమ్మ జన్మించింది. ఈమె తండ్రి అనుపిండి భవానీశంకరం, తల్లి నరసమ్మ గార్లు. సీతమ్మ తండ్రి శంకరం గారిని గ్రామస్తులు 'బువ్వన్న' గారని ముద్దు పేరుతో పిలుస్తుండేవారు. చిన్ననాటి సీతమ్మ కు తల్లి, తండ్రి గురువులై కథలు, గాథలు, పాటలు, పద్యాలు అన్నీ నేర్పారు. ఆమె ఆ రోజుల్లో స్త్రీ విద్య నేర్చుకునే అవకాశాలు అంతగా లేకపోవడంతో ప్రాచీన సాంప్రదాయాలకు బద్దురాలై, పెద్దబాలశిక్ష వంటి గ్రంథాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చెయ్యకుండానే, పెళ్ళికి సిద్ధపడాల్సి వచ్చింది. బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ కాలం చేస్తే, ఇల్లు చక్కదిద్దే భారం సీతమ్మ పై పడింది.
గోదావరి నది పాయలలోని లంకగన్నవరంలో సంపన్న కుటింబీకుడు డొక్కా జోగన్న పంతులు. పెద్ద రైతే కాకుండా, పంతులు వేద పండితుడైనందున ఒక రోజున పండిత సభకు వెళ్లి వస్తూ, మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నమవడం వలన, భవానీ శంకరం గారి ఆహ్వానంపై వెళ్లి, ఆ పూట వారి ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. జోగన్న కు ఆతిధ్యం ఇవ్వడం పట్ల సీతమ్మ చూపించిన ఆడరాభామానాలకు ఆయన ముగ్ధుడు అవడం జరిగింది. అప్పట్లో యవ్వనంలో ఉన్న సీతమ్మ మర్యాద, అణకువ కూడా నచ్చి జోగన్నకు ఆమెను పెల్లిచేసుకోవాలనే కోరిక కలిగింది. ఆయనకు సాముద్రిక శాస్త్రంలో కూడా ప్రవేశం ఉంది. బువన్న సీతమ్మను డొక్కాజోగన్న కు ఇచ్చి వైభవంగా పెళ్ళి జరిపించాడు. సీతమ్మకు మెట్టినింట్లో అడుగు పెట్టగానే డొక్కా ఇంటి పేరుగా మారింది. ఆమెకు వయసుతో బాటు ఉదార గుణం కూడా నానాటికీ పెంపొందసాగింది. జోగన్న - సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి ఆనందించనివారు లేరనే చెబుతుండే వారు. శుచి, శుభ్రతలతో బాటు ఆప్యాయతా, ఆదరణలకు వారి ఇల్లు పెట్టింది పేరుగా ఆ గ్రామమంతా చెప్పుకునేవారు. ఆ కాలంలో గోదావరి దాటాలంటే ఒకే ఒక ప్రయాణ సాధనం పడవ. జోగన్న ఊరు లంకగన్నవరం గోదావరికి మార్గమధ్యంలో ఉన్నందు వల్ల ప్రయాణీకులు అలసి అక్కడకు చేరేవారు. అలాటివారికి అన్నపానాలు సమకూర్చడం సీతమ్మ భర్తతో కలిసి చేస్తుండేది. ఆ ఇంటి దంపతుల లక్ష్యం ఒక్కటేగా ఉండేది. ఎవరు ఏ వేళలో వచ్చి భోజనమని అడిగినా లేదు, తర్వాత రా అనే పదాలే లేకుండా, ఆదరించి అన్నంపెట్టడం వారికి నిత్యకృత్యంగా మారింది.
ఇతర విశేషాలు
  • జననం1841 నుండి మరణము 1909 వరకూ గల ఈమె చరిత్ర సెకండరీ పాఠశాల తెలుగు పాఠ్యాంశముగా చేర్చబడినది.
  • గన్నవరం గోదావరి నదిపై కల అక్విడెక్ట్ కు ఈమె పేరున డొక్కాసీతమ్మ అక్విడెక్ట్ అని నామకరణం చేసారు.
  • ఆంధ్ర దేశపు కీర్తి పతాకను ఇంగ్లండు వరకు వ్యాపింపజేసి, మాతృప్రేమను అతిథులకుపంచి, జీవితాన్ని చరితార్థం చేసుకున్న అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ.
  • ఆమె కేవలం అన్న దానమే కాదు, ఎన్నో పెళ్ళిళ్ళకూ, ఇతర శుభాకార్యాలకూ విరాళాలు యిచ్చిన దాత కూడా.
  • చందాల రూపంలో కాని, విరాళాల రూపంలో కాని ఎవరి వద్దా ఏమీ తీసుకోని కారణంగానూ, ఆస్తిపాస్తులు ఏమీ లేని కారణంగానూ ఆమె వంశస్తులు ఆమె తదనంతరం ఎక్కువకాలం ఈ వితరణ జరపలేకపోయారు

1970 ల వరకు కాశీ లో గర్భగుడిలో అన్నపూర్ణ సమక్షంలో సీతమ్మగారి ఫొటో వుండేదట. అలాగే కింగ్ జార్జి చక్రవర్తి (ఎలిజబెత్ మహారాణి గారి తండ్రి) ప్రతి యేటా ఢిల్లీ లో జరిగే తన పట్టాభిషేకానికి రమ్మని ఎన్ని సార్లు ఆహ్వానం పంపినా, ఏమాత్రం పేరు ప్రతిష్ఠలు ఆశించని సీతమ్మ గారు వెళ్ళలేదట. కనీసం ఫొటో అడిగినా ఇవ్వలేదట. అయితే చివరిలో ఒక యేడాది కలెక్టరు గారికి అల్టిమేటం వచ్చదట, ఫొటో తీసుకుని రాకపోతే కొలువు పోతుందని. అప్పుడు ఆ కలెక్టరు వచ్చి, బతిమాలి ఒక ఫొటో తీసుకున్నాడుట. దాన్ని నిలువెత్తు సజీవ చిత్రంగా మార్పించి, మొదటి వరసలో, ఆహూతుల సమక్షంలో ఉంచి, ఢిల్లీలో పట్టాభిషేకం చేసుకున్నాడట చక్రవర్తి. మనకు స్వాతంత్రం వచ్చాకా, ఆ చిత్ర పటాన్ని కొన్నేళ్ళు బ్రిటిష్ పార్లమెంట్ లో ఉంచారట. తరువాత అది ఇంగ్లాండులోని మ్యూజియం లో పెట్టారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి