18, మే 2014, ఆదివారం

ముట్నూరి కృష్ణారావు -- ప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, కృష్ణా పత్రిక సంపాదకుడు

చిత్రముచిత్రము

ముట్నూరి కృష్ణారావు (1879 - 1945) ప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు, కృష్ణా పత్రిక సంపాదకుడు. ఈయన 1907 నుండి 1945లో మరణించేవరకు నాలుగు దశాబ్దాల పాటు కృష్ణా పత్రిక సంపాదకునిగా తెలుగు సాహితీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తెలుగు పత్రికలకూ, సంపాదకులకూ- ఒరవడిని, కొత్త గౌరవాన్ని ఆపాదించిన మహానుభావుల్లో ఆద్యులనతగ్గవారు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు.
క్రియాశీలకమైన పాత్రికేయతకు, విలక్షణ సంపాదకీయ రచనా సంవిధానానికీ ముట్నూరి కృష్ణారావు తెలుగులో తొలి చిరునామా వంటి వారు. ముట్నూరివారు కృష్ణా పత్రిక సంపాదక బాధ్యతలు స్వీకరించే సమయానికి తెలుగు పత్రికా రంగం బాల్య దశను దాటి వికసిన దిశవైపు చూస్తున్నది. ఈ సమయంలో తమ వ్యక్తిత్వ ముద్రతో, ప్రతిభా పాండిత్య సంపదలతో తెలుగు పత్రికా రంగానికి దిశానిర్దేశం చేసినవారు ముట్నూరి.
"కృష్ణా పత్రిక" సంపాదకులు గా తెలుగు ప్రజలను చైతన్యవంతం చేసిన ప్రముఖ పాత్రికేయులు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు 1879 లో కృష్ణా జిల్లా దివి తాలూకా ముట్నూరుగ్రామం లో జన్మించారు. ఈయన ప్రాధమిక విద్యాభ్యాసం బందరులోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఆ తరువాత బందరులోనే నోబుల్ కళాశాలలో ఎఫ్.ఏ కోర్సులో చేరారు. ఇక్కడే ఈయనకు రఘుపతి వెంకటరత్నంనాయుడు యొక్క శిష్యుడయ్యే అవకాశం కలిగింది. నాయుడు యొక్క సంఘసంస్కరణశీలన, మూఢాచార నిర్మూలణ వంటి ఉద్యమాలు కృష్ణారావును ప్రభావితం చేశాయి. గురువుతో కలిసి బ్రహ్మసమాజములో ధార్మిక ఉపన్యాసాలు ఇవ్వటం అలవాటయ్యింది. నాయుడు కృష్ణారావును ఆదర్శ విద్యార్ధిగా తీర్చిదిద్దటమే కాక, బ్రహ్మసమాజ ప్రచారకునిగా మలచాలని ప్రయత్నించాడు. అదే సమయంలో ఆంధ్ర పత్రిక సంపాదకుడు కాశీనాథుని నాగేశ్వరరావు ఐదువందల రూపాయల వేతనం ఆశచూపి కృష్ణాపత్రికనుండి తమపత్రికకు ఆకర్షించ ప్రయత్నించారు. మరోవైపు పట్టాభి సీతారామయ్య కృష్ణారావును రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేశారు. కానీ కృష్ణారావు వీటన్నింటికీ లొంగక జీవితాంతము కృష్ణాపత్రికలోనే పనిచేస్తూ తెలుగు భాషకు సేవ చేశారు.
బందులో విద్యాభ్యాసము తర్వాత కృష్ణారావు మద్రాసు క్రిష్టియన్ కళాశాలలో బి.ఎ. చేరారు. ఇక్కడే ఈయనకు పట్టాభి సీతారామయ్య సహాధ్యాయిగా పరిచయమయ్యారు. కృష్ణారావు సంస్కృత సాహిత్యంతో పాటు ఆధునిక ఆంగ్ల సాహిత్యాన్ని కూడా అభ్యసించారు. అవకాశం దొరికినప్పుడల్లా ఎమర్సన్, వాల్ట్ విట్మన్, షెల్లీ, కూపర్ ల వంటి పాశ్చ్యాత్య రచయితల రచనలు చదివేవారు. కానీ బి.ఎ ఉత్తీర్ణులు కాలేదు. 1903లో బందరు తిరిగివచ్చి కృష్ణాపత్రికలో సహాయ సంపాదకునిగా చేరి, 1907లో సంపాదకుడైనారు. అప్పటినుండి 1945లో మరణించేవరకు ఆ పత్రికకు సంపాదకునిగా పనిచేశారు. తెలుగులోనే కాక మరే భాషలోనూ అన్ని సంవత్సరాలు ఒకే పత్రికకు సంపాదకత్వం వహించిన ఘనత కృష్ణారావుదే. మట్నూరి కొంతకాలం ఆంధ్ర భారతి అనే సాహిత్య పత్రికను కూడా నిర్వహించారు.

తరువాతి కాలం లో బందరు (మచిలీ పట్నం) లో స్థిరపడి ఆంగ్ల భాషలో గొప్ప వక్తగా పేరొందారు. కృష్ణారావు కృష్ణాపత్రిక సంపాదకులుగా తననుతాను పరిమితం చేసుకోకుండా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. జాతీయోద్యమంలో పాల్గొంటున్నవారికి దిశానిర్దేశం చేశారు. బందరు ప్రాంత కాంగ్రెస్ రాజకీయాలలో ఆదర్శవంతమైన నిర్ణయాలకు కారణమయ్యారు. గొట్టిపాటి బ్రహ్మయ్య వంటి మంచి నాయకులకు తగిన ప్రోత్సాహాన్ని అందించారు. భోగరాజు పట్ట్భాసీతారామయ్య, ముట్నూరి అత్యంత ఆప్తమిత్రులు. అయితే కొన్ని సందర్భాలలో పట్ట్భాని విమర్శించేందుకు కూడా ముట్నూరి వెనుకాడలేదు. సూత్రబద్దత ప్రాతిపదికగా ఈ విమర్శలు చేశారు. బందరులో ముట్నూరివారి కార్యాలయం కృష్ణాపత్రిక దర్బారుగా ప్రిసిద్ధిని పొందింది. ఎందరెందరో సాహితీవేత్తలు ఆ దర్బారు చర్చల్లో పాల్గొన్నారు.. కృష్ణా పత్రిక జాతీయోద్యమ కాలం లో చురుకుగా వ్యవగహరించేది. ఆ రోజుల్లో పత్రిక కార్యాలయలం లో రాజకీయ, కళా, సాంస్కృతిక, సాంఘీక విషయాలపై పలు చర్చలు జరిగేవట. ఈ పత్రిక సంపాదకత్వ బాధ్యత ను సమర్ధవంతంగా నిర్వహించిన శ్రీ ముట్నూరి ఒక కళగా, తపస్సుగా పరిగణిస్తూ పత్రిక నడిపేవారని పత్రికారంగ ప్రముఖులు చెబుతుంటారు. కృష్ణా పత్రిక లో వచ్చే వార్తల పై ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉండేదట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి