
కందాళ సుబ్రహ్మణ్య తిలక్ విశాఖపట్నం జిల్లాలో జూలై 15 1920 న జన్మించారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీలో తిలక్ విద్యాభ్యాసం చేశారు. అదే సమయంలో స్వాతంత్రం కోసం పోరాడుతున్న గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, విద్యాభ్యాసం చేస్తుండగానే ఉద్యమంలోకి దిగారు. 1942 ఆగస్టు 9 వ తేదీన చేపట్టిన పికెట్తో తిలక్ ఉద్యమంలోకి ప్రవేశించారు. ఈ పికెట్లో ఉత్తరాంధ్రకు చెందిన 14 మంది పాల్గొన్నారు. వారితో కలిసి చాలా ఉద్యమాల్లో తిలక్ భాగస్వామి అయ్యారు.
కందాళ సుబ్రహ్మణ్య తిలక్ స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా రెండు సార్లు జైలు జీవితం గడిపారు. ఈ రెండు విడతల్లో దాదాపు 130 రోజులు జైలులోనే ఆయన గడిపారు. 1942లో పికెటింగ్ చేపడుతున్న సమయంలో తిలక్ను బ్రిటిష్ వారు అరెస్టు చేశారు. విజయనగరం సబ్ జైలులో కొంత కాలం ఉంచారు. ఆ తర్వాత 1943 జనవరి 26న విజయనగరంలోని ప్రకాశం పార్కులో జాతీయ జెండా ఎగుర వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కార్యక్రమ నిర్వహణకు ఉద్యుక్తులవుతున్న సమయంలో తెల్ల దొరలు వచ్చి అందరినీ పట్టుకుపోయారు. వీరిలో తిలక్ కూడా ఉన్నారు. అప్పట్లో కేరళ రాష్ట్రం బళ్లారి ఎయిర్ఫోల్డ్ జైలుకు తరలించారు. ఈ జైలులో తిలక్ నాలుగు నెలలు గడిపారు.
జైలులో దాదాపు 130 రోజులు గడిపిన తిలక్ అనేక ఇబ్బందులకు గురయ్యారు. జైలులో జెండా ఉంచా రహే రమారా... బొలో స్వతంత్ర భారత్కి జై... అనే నినాదాలను ఉద్యమకారులు చేసేవారు. దీనికి తెల్ల దొరలు కోపోద్రోక్తులే లాఠీలు విరిగేలా చితకబాదేవారు. అలాగే వీరికి సరైన భోజనం కూడా బ్రిటిష్ వారు అందించేవారు కాదు. ఉదయాన నూకల జావ, మధ్యాహ్నం 14 గ్రాములు మాత్రమే అన్నం, మట్టి కుండల్లో వేసిన పిక్క చారును భోజనంగా ఇచ్చేవారు. అయినప్పటికీ స్వాతంత్య్రోద్యమంలో లీనమైన ఉద్యమకారులు లాఠీ దెబ్బలను లెక్క చేయలేదు. అలాగే వారు ఏ భోజనం పెట్టినా ఆనందంగా భుజించేవారు. ఈ విధంగా తెల్ల దొరల చిత్ర హింసలను తట్టుకుంటూనే ఎంతో ఓపికతో తిలక్ జైలు జీవితం గడిపారు. కాగా, తిలక్ను అరెస్టు చేసిన సమయంలో భార్య సూర్య శేషుకాంతం తనను కూడా అరెస్టు చేసి భర్తతో తీసువెళ్లాలని పట్టుబట్టారు.
కందాళ సుబ్రహ్మణ్య తిలక్ ఎన్నో పోరాటాల ద్వారా స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1952లో జరిగిన ఎన్నికల్లో పోటీ రంగంలో దిగారు. పూసపాటి విజయరామగజపతిరాజు, ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకుడు జయప్రకాష్ నారాయణ ప్రోద్బలంతో తిలక్ ఇచ్ఛాపురం పాయకరావు పేట పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేశారు. పోటీ బరిలో నలుగురు నిలిచారు. బివి సంజీవరావు, పసుమర్తి వీరభద్రరావు, కాళ్లకూరి కృష్ణమూర్తి, తిలక్ మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో లక్షా 87 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి ఎంపిగా ఎన్నికయ్యారు. అప్పట్లో మహాత్మా గాంధీ ఎప్పటికప్పుడు తిలక్కు ఉత్తరాలు రాసేవారు
భారత దేశానికి స్వాతంత్య్ర వచ్చిందని ఆనందపడడమే తప్ప, ఆ ఫలాలు అందరికీ దక్కడం లేదని, మనకు స్వాతంత్య్ర వచ్చి 62 సంవత్సరాలు కావస్తున్నా దేశంలో పేదరికం కొనసాగుతూనే ఉందని, రాజకీయ నాయకుల హవా కొనసాగుతున్న ప్రస్తుత కాలంలో పేదవారు మరింత పేదరికంలోకి వెళ్తున్నారన్నారనీ ఆయన అభిప్రాయం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి