3, ఏప్రిల్ 2014, గురువారం

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు --- సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి.

టంగుటూరి ప్రకాశం పంతులు (ఆగష్టు 23, 1872 – .మే 20, 1957) సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు, టంగుటూరి ప్రకాశం పంతులు. 1940, 50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరు. ప్రత్యేకాంధ్ర రాష్ట...్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవారు.
టంగుటూరి ప్రకాశం 1872 ఆగష్టు 23 న ఇప్పటి ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెము గ్రామంలో సుబ్బమ్మ, వెంకట నరసింహం దంపతులకు జన్మించారు. ఆరుగురు పిల్లల్లో ప్రకాశం ఒకడు. అప్పటి గుంటూరు జిల్లాలోని టంగుటూరి లో వారి కుటుంబం వంశపారంపర్యంగా గ్రామ కరణం వృత్తి లో ఉండేది. ఆయన పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరారు.
వల్లూరులో ప్రకాశం ప్రాథమిక విద్య సాగింది. అల్లరి చిల్లరి సావాసాల వల్లా, నాటకాల వ్యాపకం వల్లా, ప్రకాశానికి మెట్రిక్ పాస్ అవడం కష్టమయ్యింది. మిషను పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావునాయుడు చలవతో ప్రకాశం ఫీజు లేకుండా ప్రీ మెట్రిక్ లో చదివారు. నాయుడు రాజమండ్రి కి నివాసం మారుస్తూ, ప్రకాశంను తనతో తీసుకువెళ్ళి, అక్కడ ఎఫ్.ఏ. లో చేర్పించాడు. తరువాత మద్రాసుకు పంపించి, న్యాయశాస్త్రం చదివించారు. ప్రకాశం 1890 లో తన అక్క కూతురైన హనుమాయమ్మను పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాత కొద్దికాలంపాటు ఒంగోలు లో న్యాయవాద వృత్తి చేసి, 1894 లో మళ్ళీ రాజమండ్రి చేరారు. వృత్తిలో బాగా పేరూ, పుష్కలంగా సంపదా సంపాదించారు. తన 35వ ఏట రాజమండ్రి పురపాలక సంఘానికి అధ్యక్షుడయ్యారు.
అప్పట్లో ప్రకాశం సెకండ్ గ్రేడ్ ప్లీడరు. కనుక పై స్థాయి కోర్టులలో వాదించడానికి అర్హత లేదు. బారిస్టరులకు మాత్రమే ఆ అర్హత ఉండేది. ఒకమారు ప్రకాశం ప్రతిభ గమనించిన ఒక బారిస్టరు ప్రకాశంను కూడా బారిస్టరు అవమని ప్రోత్సహించారు. ఆ సలహా నచ్చి, ప్రకాశం 1904 లో ఇంగ్లాండు వెళ్ళారు. వెళ్ళే ముందు మహాత్మా గాంధీ లాగానే మధ్యం, మాంసం, పొగాకు ముట్టనని తల్లికి మాట ఇచ్చి ఒప్పించారు. దీక్షగా చదివి బారిస్టరు అయ్యారు. అక్కడ భారతీయ సొసైటీలో చేరి దాదాభాయి నౌరోజీ బ్రిటీషు పార్లమెంటుకు ఎన్నిక కావడానికి ప్రచారంలో పాలు పంచుకొన్నారు. ఈ సమయంలో ప్రకాశంకు జాతీయ భావాలు, సాంఘిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగాయి. 1907లో, లండనులో ప్రశంసాపత్రంతో బారిష్టరు కోర్సు పూర్తిచేసుకొని భారతదేశం తిరిగివచ్చాక, ప్రకాశం మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బారిష్టరులందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు. పేరుపొందిన తెలుగు బారిష్టరులలో ఈయనే ప్రప్రధముడు.అదే సంవత్సరం బ్రిటిషు ప్రభుత్వం పాల్ ప్రసంగాలు రాజద్రోహాన్ని ఉసిగొల్పేవిగా, ఉద్రేకపూరితముగా ఉన్నవని భావించటం వలన, ఇతరులు ముందుకు రావటానికి భయపడే సమయంలో, ఈయన బిపిన్ చంద్ర పాల్ ఇచ్చిన ప్రసంగాలకు హాజరయ్యేవారు. లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం కాంగ్రెసు పార్టీ మీటింగులకు తరచుగా హాజరు కావటం ప్రారంభించి, 1921 అక్టోబరు లో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశారు. 1921 లో స్వాతంత్ర్య సమరంలో అడుగుపెట్టి వృత్తిని వదలిపెట్టేనాటికి, లక్షల్లో సంపాదించాడు. ఆ యావదాస్తినీ, దేశసేవకే ఖర్చు చేసారు.
లాభదాయకమైన న్యాయవాద వృత్తిని వదిలి ఇంగ్లీషు, తెలుగు మరియు తమిళ భాషలలో ఏకకాలమున విడుదలవుతున్న స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం చేపట్టారు. ఈయన ఒక జాతీయ పాఠశాలతో పాటు ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపారు. 1921 డిసెంబర్లో జరిగిన అహమ్మదాబాదు సదస్సులో కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. ఏదైనా అలజడి కానీ, కల్లోలం కానీ జరిగినప్పుడు ప్రజలను ఓదార్చేందుకు అక్కడ పర్యటించేవారు. ఈయన అకాలీ సత్యాగ్రహమప్పుడు పంజాబ్ ప్రాంతంలో, హిందూ-ముస్లిం ఘర్షణలు తలెత్తినపుడు ముల్తాన్ లోనూ పర్యటించాడు. కేరళలో మోప్లా తిరుగుబాటు సమయములో బయటిప్రాంతాల వారిపై నిషేధం విధించినా లెక్కచేయకుండా ఆ ప్రాంతాన్ని పర్యటించి, పర్యవసానంగా ఊటీ లోని తన ఆస్తిని ప్రభుత్వానికి కోల్పోయారు. 1922లో సహాయనిరాకరణోద్యమం సందర్భంగా గుంటూరులో 30,000 మంది స్వఛ్ఛందకులతో ఒక ప్రదర్శనను నిర్వహించారు. 1926లో కేంద్ర శాసనసభకు కాంగ్రెసు పార్టీ అభ్యర్ధిగా ఎన్నికైనారు. అక్కడ విఠ్ఠల్భాయి పటేల్, మదన్ మోహన్ మాలవ్యా, జిన్నా మరియు జి.డి.బిర్లా వంటి జాతీయ నాయకులు ప్రకాశం సహచరులు.
సైమన్ కమీషను, భారత దేశాన్ని సందర్శించవచ్చినప్పుడు కాంగ్రెసు పార్టీ సైమన్, గోబాక్' (సైమన్, తిరిగివెళ్లు) అన్న నినాదముతో ఆ కమీషన్ను బహిష్కరించటానికి నిర్ణయించింది. కాంగ్రెసు పార్టీ ఈ కమీషనును బహిష్కరించటానికి అనేక కారణాలున్నాయి అయితే ఆ కమీషనులో ఒక్క భారతీయ ప్రతినిధి కూడా లేకపోవటం ప్రధానమైనది. కమీషన్ వెళ్లినచోటల్లా నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు స్వాగతం పలికాయి. 1928, మార్చి 2న కమీషన్ బొంబాయిలో అడుగుపెట్టినపుడు పోలీసులు మద్రాసు వంటి సున్నిత ప్రదేశాలలో నిరసన ప్రదర్శనలను అనుమతించలేదు. స్వాతంత్ర్యోద్యమకులు “సైమన్ గోబ్యాక్“ అంటూ ప్యారీకార్నర్ లో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ సైమన్ కమిషన్ సభ్యుల్ని ముందుకు కదలనివ్వలేదు. జాతి దురహకారపూరితులైన బ్రిటిష్ అధికారులు స్వాతంత్ర్యోద్యమకారులమీద విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఓ యువ నేత అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
ఉద్యమకారుల్లో ఆవేశం ఉప్పొంగి కెరటమై ఎగసిపడింది. ప్రాణాలు కోల్పోయిన నేతను గుర్తించాలని కోరిన నేతల్నికూడా రైఫిల్ చూపించి బ్రిటిష్ సైన్యం బెదిరించింది. ఎవరైనా ముందుకొస్తే కాల్చి పారేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడివాళ్లు అక్కడే స్థాణువులయ్యారు. ఇంతలో ఓ యువకెరటం ఉప్పెనలా ముందుకురికింది. కోటు గుండీల్ని లాగేసి గుండెల్ని చూపిస్తూ “ దమ్ముంటే కాల్చండిరా..!” అంటూ ఆ యువ సింహం గుండెలు చూపించింది. బ్రిటిషర్లకు గుండెల్లో గుబులు పుట్టింది. ఆంధ్రకేసరి గర్జిస్తున్న తీరుని చూసి బ్రిటిష్ అధికారులు భయపడిపోయారు.
ఏమాత్రం పొరపాటు జరిగినా అక్కడున్నవాళ్లు ప్రాణాలు తోడేస్తారన్న సంగతి బ్రిటిష్ అధికారికి తెలిసిపోయింది. చప్పున ఆ యువనేత గుండెలకేసి గురిపెట్టిఉన్న రైఫిల్ ని కిందికి దించేసి అక్కడ్నుంచి తన పటాలాన్ని తీసుకుని మరీ వెనక్కి వెళ్లిపోయాడు. ఉద్యమకారులు ఆంధ్రకేసరికి జై.. టంగుటూరి ప్రకాశం పంతులుకూ జై.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సంఘటన తర్వాత ప్రజలు ఈయనను "ఆంధ్ర కేసరి" అన్న బిరుదు తో గౌరవించారు.
స్వాతంత్ర్య సమరయోధునిగా ప్రకాశం యొక్క ఉత్తరదాయిత్వం నేటికీ ఆంధ్ర దేశములో వెలుగొందుతూ ఉంటుంది. టంగుటూరి ప్రకాశం పంతులు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. గుంటూరు జిల్లాలో మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), నెల్లూరు జిల్లాలో నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లాలో రెండు తాలూకాలు (మార్కాపురం, గిద్దలూరు) కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు.

1 కామెంట్‌:

  1. "టంగుటూరి ప్రకాశం పంతులు - సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి."

    మరి ఇప్పుడు ఆయన కూర్చున్న కుర్చీలో ఎలాంటి వ్యక్తులు కూర్చోవాలనుకుంటున్నారో తలుచుకుంటే.....

    రిప్లయితొలగించండి